రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

రాజస్థాన్‌లో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించి ఆరుగురు మృతిచెందారు. జోధ్‌పూర్ సమీపంలోని దాంగియావాస్ వద్ద ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానికొకటి ఢీకొట్టాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు జోధ్‌పూర్ డీసీపీ భువన్ భూషణ్ యాదవ్ తెలిపారు.

మృతులను అజ్మేర్‌కు చెందినవారిగా గుర్తించామని పేర్కొన్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం ఎండీఎం ఆస్పత్రికి తరలించామని డీసీపీ తెలిపారు. ప్రమాదం తర్వాత ఘటనా స్థలిలో వాహనం వదిలేసి డ్రైవర్ పరారయ్యాడని, అతడి కోసం గాలిస్తున్నామని వివరించారు. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.

కారు నడుపుతున్న డ్రైవర్‌ నిద్రమత్తు కూడా ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.వేగంగా వచ్చిన ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జనుజ్జయ్యింది. అందులోని ఆరుగురు తీవ్రగాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాత్రివేళ ప్రమాదం జరగడం.. సమాచారం అందడంలో జాప్యం వల్ల సహాయక చర్యలు ఆలస్యంగా చేపట్టారు. దీంతో క్షతగాత్రులను రక్షించే అవకాశం లేకుండా పోయింది. ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.