రక్తమోడిన రహదారులు

రక్తమోడిన రహదారులు

ఉత్తరాదిలో రహదారులు రక్తమోడాయి. సోమవారం ఉదయం ఉత్తర్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది చనిపోవగా.. మరో 11 మంది గాయపడ్డారు. యూపీలోని బహ్రయిచ్ వద్ద రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాగ్‌పూర్‌లోని శివదహా వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్యం కోసం బహ్రయిచ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

బాధితులను లఖిమ్‌పూర్ ఖేర్ జిల్లా నయాపూర్వ ఉమ్రా గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. వీరంతా అంబేడ్కర్ నగర్ జిల్లాలోని ప్రముఖ దర్గా కిచ్చౌరా షరీఫ్‌ను దర్శించుకోడానికి అక్టోబరు 28న ఓ వాహనంలో బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి తిరుగు ప్రయాణమై స్వగ్రామానికి వస్తుండగా.. వీరు ప్రయాణిస్తోన్న వాహానం శివదహా వద్ద ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వస్తోన్న మరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఇక, ఝార్ఖండ్‌లోని ధనబాద్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా గుర్తించారు. గోవింద్‌పూర్ సాహేబ్‌గంజ్ రహదాని వద్ద ఆగి ఉన్న ట్రక్‌ను కారు ఢీకొట్టింది. దీంతో కారులోని ఇద్దరు చిన్నారులు, ఓ మహిళ సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ మాత్రమే గాయాలతో బయటపడ్డాడు. ధనబాద్ నుంచి జాంకాగ్ వెళ్తుండగా ప్రమాదం సంభవించింది.