చిన్న పొరపాటు చేసిన రాబిన్‌ ఊతప్ప

చిన్న పొరపాటు చేసిన రాబిన్‌ ఊతప్ప

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ ఆటగాడు రాబిన్‌ ఊతప్ప నిబంధనలు మరుస్తూ చిన్న పొరపాటు చేశాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌ సందర్భంగా మూడో ఓవర్‌లో సునీల్‌ నరైన్‌ బారీ షాట్‌ కొట్టాడు. ఈ సందర్భంగా గాల్లోకి లేచిన బంతి బౌండరీ లైన్‌ వద్ద ఊతప్ప చేతిలో పడినా వెంటనే జారి కిందపడిపోయింది. అయితే క్యాచ్‌ను డ్రాప్‌ చేసిన వెంటనే ఊతప్ప తన నోటి నుంచి ఉమ్మిని తీసి పొరపాటుగా బంతికి రాశాడు.

అయితే కరోనా ప్రబలిన తర్వాత బంతికి ఉమ్మిని రుద్దడం అనేది ఐసీసీ బ్యాన్‌ చేసింది. తాజా నిబంధనల ప్రకారం ఒక ఇన్నింగ్స్‌లో రెండు సార్లు మాత్రమే ఇలాంటి పొర‌పాట్లకు అవ‌కాశం ఉంటుంది. ఒక‌వేళ ప‌దేప‌దే ఇవే పొర‌పాట్లు చేస్తే బ్యాటింగ్‌ చేస్తున్న జట్టుకు అధనంగా 5 ప‌రుగుల ఇచ్చేలా పెనాల్టీ విధిస్తారు. అయితే రాబిన్‌ ఊతప్ప ఇలా చేయడం తొలిసారి గనుక దీనిపై అతను చేసిన పనికి ఎలాంటి చర్యలు తీసుకోరు. కాగా పలు ఐపీఎల్‌ సీజన్లలో కొన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడిన ఊతప్ప ఈసారి మాత్రం రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు తరపున ఆడుతూ పూర్తిగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్కసారి కూడా బ్యాటింగ్‌లో ఆకట్టుకోలేక జట్టుకు భారంగా మారాడు. ఇక ఫీల్డింగ్‌లోనూ నాసిరక ప్రదర్శనను కనబరుస్తూ పూర్తిగా విఫలమయ్యాడు.

కాగా ఇదే మ్యాచ్ లో రాబిన్ ఊతప్ప ఖాతాలో మరో చెత్త రికార్డు చేరింది. కేకేఆర్‌ చేతిలో రాజస్తాన్‌ ఓడిపోవడంతో ఐపీఎల్ లో అత్యధిక ఓటములను చవిచూసిన ఆటగాడిగా ఊతప్ప నిలిచాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఖాతాలో వున్న ఈ చెత్త రికార్డు తాజాగా ఊతప్ప పేరిట నమోదయ్యింది. ఊతప్ప ప్రాతినిధ్యం వహించిన జట్టు ఓటముల సంఖ్య 91 కి చేరుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో కోహ్లీ, దినేష్ కార్తిక్, రోహిత్ శర్మ, అమిత్ మిశ్రాలు నిలిచారు. కోహ్లీ 90, దినేష్ కార్తిక్ 87, రోహిత్ శర్మ 85, అమిత్ మిశ్రా 57 ఓటములను చవిచూశారు. కాగా వరుసగా రెండు విజయాలతో మంచి ఊపుమీద కనిపించిన రాజస్తాన్‌ కేకేఆర్‌ బౌలర్ల దాటికి లక్క్ష్య చేధనలో తడబడి 137 పరుగుల వద్దే ఆగిపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.