బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య

బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య

హైదరాబాద్‌ గోపాలపురంలో విషాద ఘటన చోటుచేసుకుంది. టెక్‌ మహీంద్రాలో పనిచేస్తున్న మహిళా టెక్కీ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని టెక్‌ మహీంద్రా కంపెనీలో పనిచేస్తున్న గోవిందరాజ సుస్మిత ఆఫీస్ బిల్డింగ్ పై నుంచి అమాంతం కిందకు దూకేసింది. తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది.

ప్రేమ వ్యవహారమే ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ప్రేమ విఫలమైందన్న బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న గోపాలపురం పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఉద్యోగిని ఆత్మహత్యపై టెక్ మహీంద్రా విచారం వ్యక్తం చేసింది. మా అత్యంత విలువైన అసోసియేట్ విషాదకర మృతి పట్ల కంపెనీ అధికార ప్రతినిధి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. బాధ్యతాయుతమైన కార్పోరేట్ సంస్ధగా దర్యాప్తు ప్రక్రియలో సంబంధిత అధికారులకు పూర్తి సహకారం అందిస్తామని కంపెనీ ప్రతినిధులు తెలియజేశారు.