వైసీపీలో కలవరం…అందుకేనా ?

Tdp Schemes Fidgeting YCP

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేరుగా ఓటర్లకు నగదు రూపంలో లబ్ది చేకూర్చే పథకాలను పకడ్బందీగా అమలు పరుస్తూ పెన్షన్ల పేరుతో ఒక్కొక్కరికి రూ. మూడు వేలు డ్వాక్రా మహిళలకు అదనంగా రూ.పది వేల చెక్కులు అందజేస్తున్నారు. దీనికి తెలుగుదేశం పార్టీ నేతలు పండుగలా, శుభకార్యాలలా కార్యక్రమాలు ఏర్పాటు చేసి అల్పాహార విందు, భోజనాలు ఏర్పాటు చేసి మరీ ఉప్పు తింటున్నారు ఓటు మర్చిపోవద్దు అని పరోక్షంగా సందేశాలు ఇచ్చి పంపుతున్నారు. ఇది వైసీపీ నేతలకు టెన్షన్ పుట్టిస్తోంది. కొన్ని చోట్ల.. ఈ కార్యక్రమాలను అడ్డుకునేందుకు తీవ్రమైన ప్రయత్నాలే చేస్తున్నారు. చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. పెన్షన్లు, చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హోదాలో వెళ్లారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు కూడా అభ్యంతర చెప్పలేదు. కానీ.. తన ప్రసంగం సమయంలో.. మొత్తం వైసీపీ పథకాల గురించి చెప్పుకోవడం ప్రారంభించడంతో గందరగోళం ఏర్పడింది. చెవిరెడ్డిని పక్కకు పంపి… చెక్కులు, పెన్షన్ల పంపిణీని ప్రారంభించారు.

అయితే తన అనుచరల సాయంతో ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో రగడ జరిగింది. దాంతో పోలీసులు ఆయనను పక్కకు తీసుకెళ్లారు. పడిపోయినట్లు చెవిరెడ్డి చలనం లేకుండా ఉండటంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అలాగే అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. పెనుకొండ వైసీపీ ఇన్చార్జ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్వగ్రామం తోపుదుర్తిలో పెన్షన్లు, డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. పరిటాల సునీత వస్తున్నారని ప్రచారం జరగడంతో తోపుదుర్తి వర్గీయులు ఆందోళన చేపట్టారు. వారందర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలోని మరో వర్గం ఈ కార్యక్రమానికి వచ్చిన పరిటాల శ్రీరామ్‌కు ఘనస్వాగతం పలికింది. తోపుదుర్తి వర్గీయులు అడ్డుకున్నా కార్యక్రమాన్ని తీదేపీ నేతలు నిర్వహించారు. నేరుగా నగదు పంపిణి పథకాలు కావడంతో ఓటర్లపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఆయా పథకాల కార్యక్రమాలను వీలైనంత వరకు వివాదాస్పదం చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మొదట్లో చెల్లని చెక్కులని చెప్పినా అవేమీ ప్రజల్లోకి పెద్దగా వెళ్లకపోవడంతో పంపిణీ కార్యక్రమాల్లో అలజడి రేపుతున్నారు.