Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దీక్ష విజయవంతం కావాలని కోరుతూ ఇంద్రకీలాద్రిపై మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మనకోసం పేరుతో టీడీపీ మహిళా నాయకురాలు ముళ్లపూడి రేణుక సారథ్యంలో మహిళలు కొండపైకి వెళ్లారు. వారికి ఆలయ ఈవో పద్మ, పాలకమండలి చైర్మన్ సాదర స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు చంద్రబాబు దీక్ష విజయవంతం కావాలని, ముఖ్యమంత్రికి మరింత శక్తిని ప్రసాదించాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ బందర్ రోడ్డులోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఏడుగంటల వరకు చంద్రబాబు నిరాహార దీక్ష చేయనున్నారు.
ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో కేంద్రప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చంద్రబాబు చేయనున్న ఈ దీక్ష జాతీయస్థాయిలో చర్చనీయాంశమయింది. అటు చంద్రబాబు దీక్షకు సినీపరిశ్రమ మద్దతు తెలిపింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, ఏపీలోని అన్ని పార్టీలు కలిసి దీనికోసం పోరాడాలని దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విజ్ఞప్తిచేశారు. హోదా ఇస్తామంటూ తొలుత హామీ ఇచ్చిన కేంద్రప్రభుత్వం తర్వాత ఎందుకు వెనక్కి తగ్గిందో అర్దం కావడం లేదని తమ్మారెడ్డి అన్నారు.