మరో ఝలక్ ఇచ్చిన ఇంటర్ బోర్డు !

తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలతో రాష్ట్రంలో తీవ్ర దుమారం రేగింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. ఇంటర్ విద్యార్ధుల ఆత్మహత్యలు, ఇంటర్‌ ఫలితాల విషయంలో జరిగిన అవకతవకలపై బుధవారం (ఏప్రిల్ 24,2019) సమీక్ష జరిపిన సీఎం కేసీఆర్‌.. పరీక్షలో ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ను ఉచితంగా చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఫెయిల్‌ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ చేస్తామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఫెయిల్‌ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా ఉచితంగానే రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ చేస్తామని గురువారం (ఏప్రిల్ 25,2019) ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగే.. ఇప్పటికే రీ-వెరిఫికేషన్‌, రీ-కౌంటింగ్‌కు డబ్బు కట్టిన వారికి తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది. ఈ ఏడాది 9లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. 3.25లక్షల మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను పునః పరిశీలిస్తామని బోర్డు తెలిపింది. రీ-కౌంటింగ్‌, రీ-వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్‌నెట్‌ కేంద్రాల దగ్గర క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదని బోర్డు స్పష్టం చేసింది. మే 15 లోపు కొత్త ఫలితాలు, కొత్త మెమోలు ఇంటికి వస్తాయని చెప్పింది. ముందు జాగ్రత్త కోసం ఫెయిల్ అయిన సబ్జెక్టుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీకి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బోర్డు సూచించింది. అయితే ఈ సాకు చూపి ఇంటర్ బోర్డు మరో ఝలక్ ఇచ్చినట్టు చెబుతున్నారు విశ్లేషకులు.