రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి

రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి

అక్టోబర్‌ 17న జరిగిన న్యూజిలాండ్ ఎన్నికల్లో ప్రధాని జెసిండా ఆర్డెర్న్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో ప్రపంచయుద్ధం తర్వాత న్యూజిలాండ్‌లో ఇంతటి భారీ విజయం సాధించడం ఇదే మొదటిసారి. గతంలో వివిధ పార్టీలతో కూడి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి జెసిండా.. ప్రస్తుతం ఒంటరిగానే అధికారం చేపట్టారు. ఇక, న్యూజిలాండ్ క్యాబినెట్‌లో తొలిసారి ఓ భారత సంతతి వ్యక్తికి అవకాశం లభించింది.

ప్రియాంక రాధాకృష్ణన్‌ న్యూజిలాండ్ మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.డైవర్సిటీ, ఇన్‌క్లూజన్, ఎథినిక్ కమ్యూనిటీ శాఖ మంత్రిగా, సామాజిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన సహాయ మంత్రిగా బాధ్యతలను ప్రియాంకకు అప్పగించారు. ప్రియాంక రాధాకృష్ణన్‌ పూర్వీకులు కేరళకు చెందినవారు కాగా.. 2006లో లేబర్ పార్టీలో చేరిన ప్రియాంక.. 2017 ఎన్నికల్లో పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో తన మాతృభాష మలయాళంలోనే ప్రసగించడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి ట్విట్టర్‌లో షేర్ చేశారు.

‘భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ మంత్రి ప్రియాంక ఆ దేశ పార్లమెంట్‌లో మలయాళంలో ప్రసగించడం భారత్ గర్విస్తోంది’అని అన్నారు. పార్లమెంట్‌లో ప్రసగించిన తర్వాత ప్రియాంక మాట్లాడుతూ.. న్యూజిలాండ్ పార్లమెంట్‌లో నా మాతృభాష మలయాళం మాట్లాడటం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. మలయాళంలో మాట్లాడానికి ఆమె ఇబ్బంది పడినా.. మాతృభాషలో ప్రసంగించడానికి ఆమె చేసిన ప్రయత్నాన్ని అందరు అభినందిస్తున్నారు.

ప్రియాంక తండ్రి ఆర్ రాధాకృష్ణన్‌ స్వస్థలం కేరళలోని ఎర్నాకులం. ఇక, ప్రియాంక సింగ్‌పూర్‌లో విద్యాభ్యాసం పూర్తిచేసి ఉన్నత విద్య కోసం న్యూజిలాండ్ వెళ్లారు. అక్కడే ఆమె ఉద్యోగంలో స్థిరపడ్డారు. గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు, వలస కార్మికుల సమస్యలపై ప్రియాంక గతంలో పనిచేశారు.