దక్షిణాది సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి, పద్మశ్రీ పురస్కార గ్రహీత షావుకారు జానకి (94) (Sowcar Janaki) కన్నుమూశారు. వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం ఇటీవల క్షీణించడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం 1:59 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఏడు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ సినీ ప్రయాణంలో షావుకారు జానకి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. నాలుగు తరాల నటీనటులతో కలిసి నటించిన అరుదైన ఘనత కూడా ఆమె సొంతం.
రేడియో ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభం
1931 డిసెంబర్ 12న జన్మించిన శంకరమంచి జానకి చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్నారు. కేవలం 14 ఏళ్ల వయసులోనే మద్రాసుకు వెళ్లి ఆకాశవాణిలో రేడియో ఆర్టిస్ట్గా తన కళా ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఇబ్బందుల మధ్య కూడా తన ప్రతిభను నమ్ముకుని సినీ రంగంలోకి అడుగుపెట్టారు.
‘షావుకారు’తో హీరోయిన్గా ఎంట్రీ
ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో 1950లో ఎన్టీఆర్ సరసన నటించిన ‘షావుకారు’ చిత్రంతో ఆమె వెండితెరకు హీరోయిన్గా పరిచయమయ్యారు. తొలి సినిమానే విజయవంతం కావడంతో ఆ సినిమా పేరు ఆమెకు ఇంటిపేరుగా మారింది. అప్పటి నుంచి ఆమె ‘షావుకారు జానకి’గా ప్రేక్షకులకు సుపరిచితమయ్యారు.
దిగ్గజ హీరోల సరసన నటన
షావుకారు జానకి తన కెరీర్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, రాజ్కుమార్, ప్రేమ్ నజీర్ వంటి పలువురు దిగ్గజ హీరోలతో కలిసి నటించారు. హీరోయిన్గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో విభిన్న పాత్రలు పోషించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు.
ఆమె కెరీర్లో మరో అరుదైన ఘనత కూడా ఉంది. ఎన్టీఆర్, ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వంటి నలుగురు ముఖ్యమంత్రులతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ప్రత్యేకత ఆమెకు దక్కింది.
మహిళలకు ఆదర్శంగా నిలిచిన జానకి
సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షావుకారు జానకి స్వశక్తితో మద్రాసులో సొంత ఇంటిని నిర్మించుకున్నారు. ఆమెకు సంబంధించిన ఈ ఇల్లు కూడా సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును పొందింది. ఎన్నో చిత్రాల షూటింగులకు ఈ ఇల్లు వేదికగా నిలిచింది.
వయసు పెరిగినా నటనపై ఆమెకున్న ఆసక్తి మాత్రం తగ్గలేదు. తొంభై ఏళ్ల వయసులోనూ సినిమాల్లో నటిస్తూ కళారంగంపై తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు.
పద్మశ్రీతో గౌరవం
దక్షిణాది సినీ రంగానికి ఆమె చేసిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2022లో షావుకారు జానకిని ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
తన సహజ నటన, విభిన్న పాత్రలు, సుదీర్ఘ కళా ప్రయాణంతో నాలుగు తరాల ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి మరణంతో భారతీయ సినీ పరిశ్రమ ఓ గొప్ప నటిని కోల్పోయింది. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
