రిసార్టులకు పంపి వ్యభిచారం

రిసార్టులకు పంపి వ్యభిచారం

ఇళ్లల్లో పని పేరిట త్రిపుర రాష్ట్రానికి చెందిన నలుగురు బాలికలను తీసుకొచ్చి.. ఓ ముఠా వ్యభిచార కుంపంలో దించి చిత్ర హింసలకు గురి చేసింది. ఈ ఘటన చెన్నైలో ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. త్రిపుర రాష్ట్రం శివజాల ప్రాంతానికి చెందిన సలీమా ఖదున్‌ అక్కడి బాలికలు, యువతులకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి బెంగళూరు, చెన్నైకు పంపిస్తోంది.

ఈ క్రమంలో త్రిపురకు చెందిన నలుగురు బాలికల్ని తొలుత ఓ బ్యూటీ పార్లర్‌లో ఉద్యోగం నిమిత్తం పంపించింది. కొన్నాళ్లు అక్కడున్న ఆ బాలికల్ని చెన్నైకు తరలించారు. ఈనెల 17వ తేదీ చెన్నై శివారులోని కేలంబాక్కం పడూర్‌లోని ఓ నివాసంలో ఈ బాలికల్ని ఉంచారు. అక్కడ అలావుద్దీన్, మైదీన్, అన్వర్, హుస్సేన్‌ అనే నలుగురు వ్యక్తులు బాలికలను చిత్రహింసలకు గురి చేయడం మొదలెట్టారు.

ఈసీఆర్‌ మార్గంలోని కొన్ని రిసార్టులకు పంపించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించారు. ఈనెల 26న వారి నుంచి తప్పించుకున్న ఓ 16 ఏళ్ల బాలిక గస్తీ పోలీసుల్ని ఆశ్రయించింది. పోలీసులు ఆ నలుగురు బాలికల్ని రక్షించారు. అయితే, ఆ మహిళతో పాటుగా ముఠా సభ్యులు మాత్రం తప్పించుకున్నారు. వీరి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా బాధిత బాలికలను త్రిపురకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.