Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విశాఖ భూకుంభకోణం చుట్టూ ఏపీ రాజకీయం కేంద్రీకృతం అవుతోంది. ఈ కుంభకోణంలో అన్ని పార్టీల నాయకుల పేర్లు వినబడుతున్నాయి. అయితే అధికార టీడీపీ నేతల మీద విమర్శల దాడి ఉద్ధృతమైంది. ఈ వ్యవహారంలో నేరుగా మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు వినిపించకపోయినా దాంతో సంబంధం ఉన్నందువల్లే ఆయన తన పేరు బయటికి రాకుండా విశాఖలో మకాం వేశారని వైసీపీ అనుకూల మీడియా ఘోషిస్తోంది. అందులో నిజానిజాలేమిటో తెలిసే లోపే ఇందుకు సంబంధించి ఇంకో కొత్త పేరు సీన్ లోకి వచ్చింది. ఆమె టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత. ఆమె మీద ఆరోపణలు చేసింది జగన్ కి కుడిభుజం లాంటి విజయసాయి.
విశాఖ భూదందాల వ్యవహారంలో విజయసాయి టీడీపీ సర్కార్ మీద ఆరోపణలు చేయడాన్ని అనిత తప్పుబట్టారు. 14 కేసుల్లో A 2 గా వున్న వ్యక్తి ఇంకొకరిపై ఆరోపణలు చేయడం విడ్డురంగా ఉందని ఆమె అన్నారు. ఆ కేసుల్లో అరెస్ట్ లు తప్పించుకోడానికే విజయసాయి రాజ్యసభ సభ్యత్వం తెచ్చుకున్నాడని ఆమె ధ్వజమెత్తారు. ఇక భూకుంభకోణంలో విజయసాయి తన పేరు తీయడాన్ని తీవ్ర స్థాయిలో నిలదీశారు. తనతో బహిరంగ చర్చకు వచ్చి ఒకవేళ అందులో తన తప్పుందని విజయసాయి నిరూపిస్తే ఆయన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకుంటానని అనిత చెప్పారు. అలా కాకుండా తన తప్పు లేదని తేలితే విజయసాయి తన కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకుంటారా అని ప్రశ్నించారు. మొత్తానికి విశాఖ భూకుంభకోణం వ్యవహారంలో సవాళ్లు, ప్రతి సవాళ్లు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. కిందటి ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ ఓడిపోయిన విశాఖ లో ఎలాగైనా గెలవాలని వైసీపీ ప్రత్యేక దృష్టి సారించింది.