సజ్జనార్ మరో కీలక నిర్ణయం

సజ్జనార్ మరో కీలక నిర్ణయం

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న నిర్ణయాలు తీసుకుంటూ సంస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచుతున్న సీనియర్ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంస్థ అభివృద్ధికి కష్టపడే సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని అన్ని డిపో, డివిజనల్‌, ప్రాంతీయ మేనేజర్లతో బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆర్టీసీ అభివృద్ధికి కష్టపడి పనిచేసే వారికి ప్రోత్సాహకాలు అందించాలి. ప్రతి ట్రిప్పులో ఐదుగురు ప్రయాణికులను అదనంగా ఎక్కించుకోగలిగితే లాభాల దిశగా ప్రయాణించొచ్చు’ అని సజ్జనార్‌ చెప్పారు. మెరుగైన పనితీరు కనబర్చిన సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించాలని, కార్గో సేవలను మరింతగా విస్తరించాలని అధికారులను ఆదేశించారు.

ఆర్టీసీని కించపరిచేలా ప్రకటన ఉండటంతోనే సినీహీరో అల్లు అర్జున్‌కి లీగల్ నోటీసులు పంపించామని, అంతేతప్ప ఎవరిపైనా వ్యక్తిగత ద్వేషం లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. ప్రజల ఆలోచనను ప్రభావితం చేసే స్థానాల్లో ఉన్న నటులు, సెలబ్రెటీలు ఇలాంటి ప్రకటనల్లో నటించే ముందు ఓసారి ఆలోచించాలని సజ్జనార్ సూచించారు.