వెంకన్నను ప్రతిష్టాత్మక అవార్డు

వెంకన్నను ప్రతిష్టాత్మక అవార్డు

పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లీ బంధీ అయిపోతోందో కనిపించని కుట్రల.. అంటూ విచ్ఛిన్నమైపోతున్న పల్లె జీవనాన్ని కళ్లకు కట్టిన ప్రజాకవి, ప్రజా గాయకుడు, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వెంకన్నకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును ప్రకటించింది. సాహిత్య రంగంలో చేసిన సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు తెలంగాణ ప్రజా గాయకుడు గోరెటి వెంకన్న ఎంపికవడం విశేషం. 2021 ఏడాదికి తెలుగు సాహిత్యంలో వెంకన్న ఎంపికయ్యారు.. ఆయన వల్లంకి తాళం కవితా సంపుటికి అవార్డు వరించింది.

నాగర్ కర్నూల్ జిల్లా గౌరారం సమీపంలోని తెల్కపల్లిలో నర్సింహ, ఈరమ్మ దంపతులకు గోరెటి వెంకన్న జన్మించారు. చిన్నప్పటి నుంచి పాటలంటే మక్కువ పెంచుకున్న వెంకన్న.. మాస్టారు ప్రోత్సాహంతో కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. విద్యార్థి దశ నుంచే విప్లవ గీతాలు రచించి ఆలపించేవారు. సినీ రచయితగానూ పలు సిమిమాలకు పాటలు రాశారు. చేతివృత్తులు అంతరించిపోతున్నాయని.. పల్లె జీవనం కనుమరుగైపోతుందంటూ ఆయన రాసిన పల్లె కన్నీరుపెడుతుందో పాట బాగా ప్రాచుర్యం పొందింది.

ఇటీవల ఆయన అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. గవర్నర్ కోటాలో ఆయనను శాసన మండలికి ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. కవులు, కళాకారుల కోటాలో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. 2016లో గోరెటి వెంకన్న కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకున్నారు.