థియేటర్‌లో టిక్కెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ

థియేటర్‌లో టిక్కెట్లు అమ్మిన విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ థియేటర్‌లో టిక్కెట్లు అమ్మారు.‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ప్రచారంలో భాగంగా   విజయ్ దేవరకొండ తొలి సినిమాగా ‘మీకు మాత్రమే చెప్తా’ను నిర్మించిన సంగతి తెలిసిందే. తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎప్పటిలానే హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ఐమ్యాక్స్‌లో ఉదయం 8.45 గంటల షోతో చిత్ర ప్రదర్శనలు మొదలయ్యాయి.
ఐమ్యాక్స్‌లో షో పూర్తయ్యే సమయానికి విజయ్ దేవరకొండ అక్కడికి చేరుకున్నారు. మీడియాకు ముందుగానే సమాచారం అందడంతో బెంజ్ కారు వచ్చి ఆగగానే మైక్‌లు, కెమెరాలు పట్టుకుని మీదపడ్డారు. కాసేపటికి కారులో నుంచి బయటికి వచ్చిన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు నవ్వుతూ అభివాదం చేశారు. ఆ తరవాత బాక్సాఫీసు‌లోకి వెళ్లి ప్రేక్షకులకు టిక్కెట్లు అమ్మారు. అయితే, ఈ టిక్కెట్లను ఆయన డబ్బులు తీసుకుని అమ్మలేదు. ఉచితంగానే ఇచ్చారు. కొంత మంది ఆడియన్స్‌కు ఉచితంగా సినిమా టెక్కెట్లు, పాప్‌కార్న్-డ్రింక్స్ కూపన్లు ఇచ్చారు.

తమకెంతో ఇష్టమైన ‘రౌడీ’ చేతుల మీదుగా టిక్కెట్లు అందుకోవడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. కొంత మంది అమ్మాయిలు అయితే ఎగిరి గంతేశారు. ఇది తన ఫస్ట్ ప్రొడక్షన్ కావడంతో ఫ్యాన్స్‌తో ఫుల్‌గా ఎంజాయ్ చేయడానికి వచ్చానని దేవరకొండ చెప్పారు. అందుకే, తన ఆనందాన్ని వాళ్లతో ఇలా పంచుకున్నానని చెప్పారు.

ఇదిలా ఉంటే, ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాకు యావరేజ్ టాక్ వినిపిస్తోంది. విమర్శకులు సైతం పెదవి విరుస్తున్నారు. సినిమా అంత గొప్పగా లేదంటున్నారు. ఇది మల్టీప్లెక్సుల్లో ఆడే సినిమా అని.. బి, సి సెంటర్లలో కష్టమేనని విశ్లేషకుల అభిప్రాయం. కాకపోతే విజయ్ దేవరకొండ ఈ సినిమాపై పెట్టిన డబ్బును అయితే సంపాదించేసుకుంటారని టాక్. ఏదేమైనా విజయ్ స్థాపించిన కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిన తొలి సినిమా కావడంతో ఆయన అభిమానులు కూడా సోషల్ మీడియాలో బాగా ప్రమోట్ చేస్తున్నారు.