హైదరాబాద్‌లో కలుషిత నీటి కలకలం

హైదరాబాద్‌లో కలుషిత నీటి కలకలం

హైదరాబాద్‌లో కలుషిత నీటి కలకలం రేగింది. కలుషిత నీటిని తాగి ఓ వ్యక్తి మృతి చెందడంతో పాటు వందల్లో బాధితులు ఉండడంతో ఒక్కసారిగా అలజడి రేపింది. వాంతులు, విరేచనాలతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి నుంచి పరిస్థితి మారిపోయింది. వందల సంఖ్యలో బాధితులు ఆస్పత్రులకు పరిగెడుతున్నారు. మాదాపూర్, లంగర్‌హౌజ్ ప్రాంతాల్లో జలమండలి సరఫరా చేస్తున్న తాగునీరు కలుషితమైనట్లు చెబుతున్నరు.

మాదాపూర్ పరిధిలోని గుట్టల బేగంపేట వడ్డెర కాలనీకి చెందిన భీమయ్య అనే యువకుడు కలుషిత నీరు తాగి మృతి చెందాడు. అతని రెండేళ్ల కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. అదే కాలనీకి చెందిన పలువురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. తీవ్రమైన కడుపునొప్పితో ఎక్కువ మంది బాధితులు ఆస్పత్రికి వస్తున్నారని కొండాపూర్ ఏరియా వైద్యశాల వైద్యులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 200 మందికిపైగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బాధితుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గత పదిహేను రోజులుగా కలుషిత నీరు సరఫరా అవుతోందని.. నీరు వాసన వస్తోందని ఫిర్యాదు చేస్తున్నా జలమండలి, వాటర్ వర్క్స్ సిబ్బంది పట్టించుకోలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నీళ్లు వదిలే లైన్‌మెన్‌కు చెప్పినా పట్టించుకోలేదని భీమయ్య కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు లంగర్‌హౌజ్ పరిధిలోనూ కలుషిత నీటి ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటికొకరు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వాటర్ లేదా ఫుడ్ పాయిజన్ జరిగినట్లు వైద్యులు చెబుతున్నారు. ఆ నీటితో స్నానం కూడా చేయొద్దని ఈరోజు హెచ్చరికలు చేసినట్లు సమాచారం.