భర్తని కిరాతకంగా కడతేర్చిందో కసాయి భార్య

భర్తని కిరాతకంగా కడతేర్చిందో కసాయి భార్య

ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తని కిరాతకంగా కడతేర్చిందో కసాయి భార్య. ప్రియుడితో కలసి దారుణంగా చంపేసి యాక్సిడెంట్ అయి ఇంట్లో పడి ఉన్నాడంటూ కొడుక్కి ఫోన్ చేసి చెప్పింది. ఇంటికి వచ్చిన కొడుకు బంధువుల సాయంతో పోలీసులకి సమాచారం ఇవ్వడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్యే కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసినట్లు తేలింది. ఈ అమానుష ఘటన గుంటూరులో జరిగింది.

నగరంలోని అరండల్‌పేట పోలీస్ స్టేషన్ పరిధి రాజీవ్ గాంధీ నగర్‌కి చెందిన మరియదాసు(40) మార్బుల్ పని చేస్తుంటాడు. అతనికి మరియమ్మతో 20 ఏళ్ల కిందట వివాహమైంంది. ఒక కొడుకు, కూతురు సంతానం. కూతురికి తెనాలి మండలం పెరవలికి చెందిన యువకుడితో వివాహం జరిపించారు. ఈ క్రమంలో పెరవలికి చెందిన ఆటోడ్రైవర్‌ అనిల్‌తో మరియమ్మకి పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇద్దరి వ్యవహారం భర్త మరియదాసుకి తెలిసిపోవడంతో తీవ్రంగా మందలించాడు.

ప్రియుడి మోజులో పడిన భార్య.. తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అంతమొందించాలని నిర్ణయించుకుంది. ప్రియుడితో కలసి పక్కాగా ప్లాన్ చేసి దారుణంగా హత్య చేసింది. రాత్రి వేళ కొడుకు యార్డులో పనికి వెళ్లిన సమయంలో ప్రియుడు అనిల్‌కి కబురుపెట్టింది. ఇద్దరూ కలిసి మద్యం మత్తులో నిద్రిస్తున్న మరియదాసు మెదకి ఉరి బిగించి.. రోకలి బండతో మోది అతి కిరాతకంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యారు.

అనంతరం కొడుక్కి ఫోన్ చేసి హైడ్రామాకు తెరతీసినట్లు తెలుస్తోంది. నాన్నకి యాక్సిడెంట్ అయిందని.. ఇంట్లో ఉన్నాడని చెప్పింది. కొడుకు ఇంటికి వెళ్లి విగతజీవిగా పడి ఉన్న తండ్రిని చూసి బంధువులకు చెప్పాడు. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. తెనాలి పరిసరాల్లో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించడంతో హత్య చేశామని ఒప్పుకున్నట్లు సమాచారం.