కలకలం రేపిన చేతబడి

కలకలం రేపిన చేతబడి

జిల్లాలోని చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి గ్రామంలో చేతబడి ఘటన కలకలం రేపింది. గత రాత్రి ఇంటి ముందు మంచంలో పడుకున్న చీమల సతీష్ అనే వ్యక్తి ఉదయం లేచి చూసేసరికి కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చుట్టు పక్కల వేతకగా పడుకున్న వ్యక్తి మంచం ప్రక్కన చేతబడికి సంబంధించిన మనిషి బొమ్మ, ముగ్గు గీసి అందులో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, మిరపకాయలు, బొగ్గు కనిపించాయి.

వాటిని చూసిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సతీష్ పడుకున్న మంచంలో అతని సెల్ ఫోన్ అలానే ఉంది. బైక్‌తోపాటు సతీష్ కనిపించకపోవడంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతనికి భార్య, ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. చేతబడి చేసి సతీష్‌ ఏం చేసి ఉంటారోనని అతని భార్య, తల్లి, బంధువులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే తరహాలో ఒక వ్యక్తి అదృశ్యమైనా ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదని గ్రామస్తులు చెబుతున్నారు.