కరోనాకు భయపడి మహిళ మృతి

కరోనాకు భయపడి మహిళ మృతి

కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని..జాగ్రత్తలు తీసుకుంటే నయమవుతుందని అధికారులు, డాక్టర్లు చెబుతున్నా కొందరు భయం వీడటం లేదు. తీవ్ర ఒత్తిడికి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. శనివారం కర్నూలు తాలూకా పోలీసు స్టేషన్‌ పరిధిలో ఇలాంటి సంఘటనే జరిగింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని గాయత్రీ ఎస్టేట్‌లో ఉన్న ఓ అపార్టుమెంటులో గురువయ్య, రాజ్యలక్ష్మి (68) దంపతులు నివసిస్తున్నారు. పదేళ్ల క్రితమే కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో కోడలు, మనవడి వద్ద ఉంటున్నారు. గురవయ్యకు ఇటీవల కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ రావడంతో హోంఐసోలేషన్‌లో ఉంటున్నాడు.

ఈ క్రమంలో భార్య తీవ్ర ఆందోళనకు గురైంది. చనిపోవాలని నిర్ణయించుకుని శనివారం ఉదయం బయటకొచ్చి పడిదెంపాడు వద్ద కేసీ కెనాల్‌లో దూకింది. అటువైపు వస్తున్న ఆటో డ్రైవర్‌ గమనించి వెంటనే నీటిలోకి దూకి బయటకు తీసుకొచ్చాడు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా కరోనా సోకిందని తేలగానే ఇరువురం చనిపోదామంటూ రాజ్యలక్ష్మి భర్తతో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.