ప్రాణాలు తీసిన సెల్ఫీ

ప్రాణాలు తీసిన సెల్ఫీ

సెల్ఫీ మోజులో ప్రాణాపాయాలను కూడా పట్టించుకోవట్లేదు కొందరు ఔత్సాహికులు. అందరికంటే ప్రత్యేకంగా కనిపించాలన్న ఆత్రుతతో ప్రాణాల మీదకు తెస్తోంది. నదుల పక్కన, ఎత్తైన కొండలపైనా వింత ఫోజులతో ప్రమాదాలను కొనితెచ్చుకుంటున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఓ మహిళ లోయలో పడి ప్రాణాలు కోల్పోయింది.

ఇండోర్‌కి చెందిన నీతూ మహేశ్వరి(30) కుటుంబ సభ్యులతో కలసి నగరానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న జామ్‌గేట్ ప్రాంతానికి పిక్నిక్‌కి వెళ్లింది. అక్కడ కొండలు, లోయల అందాలను చూస్తూ మైమరచిపోయిన నీతూ సెల్ఫీలకు పనిచెప్పింది. అలా సెల్ఫీలు దిగుతూ ప్రమాదాన్ని కూడా పట్టించుకోలేదు. కొండ అంచున సెల్ఫీ తీసుకుంటూ కాలుజారింది. అమాంతం లోయలో పడిపోయింది.

సమాచారం అందుకున్న పోలీసులు లోతైన లోయలో పడిపోయిన నీతూ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దట్టమైన అడవిలో నాలుగు గంటలపాటు గాలించి ఎట్టకేలకు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. నీతూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.