అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

వనస్థలిపురం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆ భర్త మాత్రం ఆమె కరోనాతో చనిపోయిందని అందరికి చెప్పి దహన సంస్కారాలు చేశారు. ఈ సంఘటన హైదరాబాద్ వనస్థలిపురం ఇంజాపూర్ సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. రహవత్ కవిత (21) అనే వివాహిత ఈనెల 18వ తేదీన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అయితే ఆమె భర్త కరోనాతో మృతి చెందిందని కవిత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.

అంత్యక్రియలు చేసిన వారం రోజుల తర్వాత కవిత మృతిపై ఆమె తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దగ్గరుండి అంత్యక్రియలు చేసిన కుటుంబ సభ్యులందరికీ నెగటివ్ రావడంతో కవిత మృతిపై అనుమానం మరింత బలపడింది. దీంతో వెంటనే కుటుంబ సభ్యులు వనస్థలిపురం ఏరియా హాస్పిటల్ లో ఎంక్వయిరీ చేశారు. అయితే కవితకు నెగటివ్ అని తేలడంతో అల్లుడు విజయ్‌ తమ కూతుర్ని హత్య చేసి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

కవితను చంపి అనంతరం కరోనా తో మృతి చెందినట్లుగా చిత్రీకరించాడని తల్లిదండ్రులు వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని కవిత స్వగ్రామం అయినా నల్గొండ పిల్లిగుంట్ల తండాలో పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీశారు. అనంతరం డెడ్ బాడీని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు.