యువతి అనుమానాస్పద స్థితిలో మృతి

యువతి అనుమానాస్పద స్థితిలో మృతి

తిరుపతి రూరల్‌ పరిధిలోని తాటితోపులో ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎంఆర్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ సీఐ దీపికా వివరాల మేరకు.. వీకోట సమీపంలోని ఆరుమాకులపల్లికి చెందిన వెంకటరత్నం రెడ్డి కుమార్తె అనిత డిగ్రీ పూర్తి చేసుకుని స్కిల్‌ డెవలప్మెంట్‌ కోచింగ్‌ కోసం తిరుపతి రూరల్‌ పరిధిలోని తాటితోపుకు 2 నెలల క్రితం వచ్చింది.

ఏమైందో ఏమో గాని శనివారం రాత్రి హాస్టల్‌ బాత్రూంలో కింద పడింది. అక్కడి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్పీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. ఎలా చనిపోయింది అనే విషయం విచారణలో తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులు మాత్రం తమ బిడ్డకు ఎలాంటి అనారోగ్యం లేదని.. ఆరోగ్యంగా ఉండేదని తెలిపారు.