Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఆపరేషన్ గరుడ… కొద్ది రోజుల కిందట హీరో శివాజీ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించిన ఈ విషయాన్ని చాలామంది తేలిగ్గా తీసిపారేశారు. కానీ… ఇప్పుడు ఏపీ మంత్రుల నోట కూడా ఇదే మాట వినిపిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ ఆర్ధిక శాఖా మంత్రి యనమల బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశ వ్యాప్తంగా బీజేపీపై ఎదురుగాలి చాలా బలంగా వీస్తోందన్నారు. దీనికి ఉపఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చినప్పట్నుంచి ఏపీపై కూడా బీజేపీ పెద్దలు కక్ష పెట్టుకున్నారని విమర్శించారు యనమల. ‘అటు జగన్తో లాలూచీ పడుతూ… ఇటు పవన్కళ్యాణ్తో విమర్శలు చేయిస్తున్నారని కన్నాతో… ఇంకెవరో లక్ష్మీనారాయణ సీఎం అవుతాడని చెప్పించడం… మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో పుస్తకాలు రాయించడం… రమణదీక్షితులతో ఆరోపణలు చేయించడం… ఈ పరిణామాలను చూస్తుంటే… ఆపరేషన్ గరుడ ప్రచారం నిజమేనేమో అనే అనుమానాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
కేంద్రం దోలేరా నగరానికి ఇచ్చిన నిధుల వివరాలు మహానాడులో చెప్పేసరికి బీజేపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయ్యిందని దాని నుంచి కోలుకునేందుకే హడావుడిగా తెలుగు రాష్ట్రాల్లో ధొలేరాపై యాడ్స్ వేశారుని అబద్దాలను నిజాలుగా నమ్మించడానికి బీజేపీ పెద్దలు పడుతున్న కష్టాల్లో భాగమే ఈ ప్రకటనలని తేలిపోయింది. వీటిని చూస్తే తెలుగువారికి పుండు మీద కారం చల్లినట్లుగా ఉందని ఆయన అన్నారు. ఇదే ధోరణితో వ్యవహరిస్తే బీజేపీ వ్యూహం బెడిసికొట్టి కన్నడలో ఎలా అయితే చాచి కొట్టారో ఏపీ ప్రజలు కూడా అదే రీతిలో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీజేపీని యనమల హెచ్చరించారు. ఏపీకి ఇస్తామన్న నిధులు చేస్తామన్న పనులు కాగితాలకే పరిమితమయ్యాయని చెప్పారు. ఏపీకి 5 ఏళ్లు కాదు… 10ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని రాజ్యసభలో బీజేపీ డిమాండ్ చేసింది నిజం కాదా? మేనిఫెస్టోలో ఏపీకి 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నప్పుడు ఇవన్నీ గుర్తు లేవా?’ అని ప్రశ్నించారు.