ప్రేమ పేరుతో వేధింపులు…కొట్టి చంపిన అమ్మాయి తండ్రి !

ప్రేమ పేరుతో అమ్మాయిల వెంట పడుతూ వారు కాదంటే వారిని చంపేవాళ్ళని, లేదా ఆత్మహత్య చేసుకుని తమకు తాము చంపుకునే వారిని చూశాం. కానీ ప్రేమ పేరుతో తన కుమార్తెను వేధిస్తున్న యువకుడిని ఓ తండ్రి కర్రలతో కొట్టి చంపిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. అందుతున్న సమాచారం ప్రకారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని కొలాంగూడకు చెందిన టేకం లస్ము కూతురిని అదే గ్రామానికి చెందిన ఆత్రం లక్ష్మణ్(20) ప్రేమించాలని ఏడాదిగా వెంట పడుతున్నాడు. అయినా ఇంట్లో చెబితే గొడవలు అవుతునాయని ఆ అమ్మాయి మౌనంగా ఉండేది. కానీ కొద్దిరోజుల క్రితం తన కుమార్తెను లక్ష్మణ్ వేధిస్తుండగా చూసిన లస్ము గ్రామంలో పంచాయతీ పెట్టాడు. తన కూతురి జోలికి రావొద్దని అందరి ముందూ హెచ్చరించాడు. అయితే తాజాగా ఆదివారం గ్రామంలో పెళ్లి వేడుక జరుగుతుండగా లక్ష్మణ్ నీతా మాట్లాడాలంటూ ఆ అమ్మాయిని పక్కకు లాక్కెళ్లాడు. అమ్మాయి కేకలు విన్న లస్ము కర్రతో లక్ష్మణ్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. లక్ష్మణ్‌ అన్న ఆత్రం భీంరావ్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కడెం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.