సీఎం బావమరిది ఇంట్లో రూ.281 కోట్లు పట్టివేత !

ఎన్నికల వేళ మధ్యప్రదేశ్‌, ఢిల్లీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ బంధువులు, సన్నిహితుల నివాసాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తం 50 ప్రాంతాల్లో దాడులు నిర్వహించగా, సీఎం బావమరిది నివాసంలో రూ.281 కోట్లు నగదు లభ్యమైంది. గోనె సంచులు, అట్టపెట్టెల్లో దాచిన ఈ మొత్తం ఓటర్లకు పంచేందుకు దాచిపెట్టినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. కమల్ నాథ్ బంధువుల ఇళ్లలో సోదాలు జరిపిన ఆదాయపు పన్ను శాఖ అధికారులు, లెక్కల్లో చూపని ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే చోట ఇంత పెద్ద మొత్తం నగదు లభ్యంకావడంతో అధికారులు విస్తుపోయారు. దీనిని తరలించేందుకు లారీని ఏర్పాటు చేయడం విశేషం. కమల్‌నాథ్‌కు మరో సన్నిహితుడి ఇంట్లో రూ. 14.6 కోట్ల నగదు సీజ్ చేశామని, కంప్యూటర్లు, కొన్ని కీలక పత్రాలు దొరికాయని అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్, ఢిల్లీ మధ్య చాలా నగదు బట్వాడా జరిగినట్టు గుర్తించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు, విచారణ కొనసాగుతుందని తెలిపారు. ఐటీ దాడులను రాజకీయ కుట్రగా మధ్యప్రదేశ్ సీఎం అభివర్ణించారు. ఎన్నికల కమిషన్‌తో కుమ్మక్కైన బీజేపీ ఈ దాడులు చేయిస్తోందని కమల్‌నాథ్ ఆరోపించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు దాదాపు 200 మంది ఐటీ అధికారులు, పోలీసులతో కూడిన బృందాలు ఇండోర్, భోపాల్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో మెరుపు దాడి చేశాయి. కమల్‌నాథ్‌కు గతంలో ఓఎస్డీగా పనిచేసిన ప్రవీణ్ కక్కర్, మాజీ సలహాదారు రాజేంద్ర మింగ్లానీ నివాసాలతోపాటు ఆయన బావమరిది నివాసంలో తనిఖీలు చేపట్టారు.