చెల్లికి గర్భం.. ప్రియుడికి అన్నల గుణపాఠం….

తెలంగాణలోని మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేసుకోకుండానే చెల్లికి గర్భం చేశాడన్న కోపంతో ముగ్గురు అన్నలు ఆ ప్రియుడిని కొట్టి బావిలో పడేశారు. అయితే తమ చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కక్షతో ముగ్గురు అన్నలు ఓ యువకుడిని హత్య చేసేందుకు కుట్ర ప్లాన్ చేశారు.

మెదక్ జిల్లా కొండపాట మండలం బందారంలో ఘోరం జరిగింది. తన చెల్లిని ప్రేమిస్తున్నాడన్న కోపంతో యువకుడిని తీవ్రంగా కొట్టిన ముగ్గురు సోదరులు అతడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో చనిపోయాడనుకుని బావిలో పడేశారు. అయితే అదృష్టవశాత్తూ అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. మెదక్‌ మద్దూరు మండలం నర్సాయపల్లికి చెందిన బింగి శ్రీకాంత్‌ అదే గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శ్రీకాంత్ హైదరాబాద్‌ నాగారంలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే యువతి కూడా హైదరాబాద్‌లోనే అన్నలతో కలిసి ఉంటూ ఉద్యోగం చేస్తోంది. తరుచూ ప్రియుడి ఇంటికి వెళ్లొచ్చేది.

ఈ క్రమంలో ప్రేమికులిద్దరూ తరుచూ శారీరకంగా కలిసేవారు. దాంతో కొన్ని రోజులకు యువతి గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తాజాగా ఆ యువతి ముగ్గురన్నలకు చెప్పింది. దీంతో వారు పెళ్లి గురించి మాట్లాడుకుందాం రమ్మంటూ శ్రీకాంత్‌కు మాయమాటలు చెప్పి చేర్యాలకు రప్పించారు. అలా కారులో ఎక్కించుకొని స్పృహ కోల్పోయేలా తీవ్రంగా కొట్టారు. ప్రాణం పోయిందనుకొని బందారం శివారులో మెడకు తాడు బిగించి ఆత్మహత్య చేసుకున్నట్లు కథ అల్లేసి ఓ బావిలోకి తోసేసి పరారు అయ్యారు.

అయితే బావిలో కాస్త నీరు, పూడిక తీసిన గడ్డ ఉండటంతో అతడు మృత్యువు నుంచి తప్పించుకున్నాడు. మంగళవారం అర్థరాత్రి స్పృహలోకి వచ్చిన తాను రక్షించాలంటూ గట్టిగా అరిచాడు. రాత్రివేళ కావడంతో అతడి వాయిస్ ఎవరికీ వినిపించలేదు. అలా.. 20 గంటల తర్వాత బుధవారం మధ్యాహ్నం అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులకు అతడి అరుపులు వినిపించాయి. దీంతో వాళ్లు వెంటనే గ్రామ పెద్దలకు, పోలీసులకు సమాచారం అందించారు. మంచాన్ని బావిలోకి దించి తాళ్లతో శ్రీకాంత్‌ను బయటకు లాగి చికిత్స కోసం సిద్దిపేటకు తరలించారు. కాగా బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు అన్నదమ్ములపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.