బుకింగ్ షాక్.. రెండు గంటల్లోనే 4లక్షల టిక్కెట్లు..

కరోనా వైరస్ లాక్ డౌన్ తో జనం అంతా ఎక్కడి వాళ్లు నిలిచిపోయారు. దాదాపు రెండు నెలల నుంచి రవాణా సౌకర్యం లేక కుతకుతలాడిపోతున్నారు ప్రజలు. దీంతో ఒక్కసారిగా లాక్ డౌన్ సడలించడంతో ఇప్పుడు ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక దేశవ్యాప్తంగా జూన్‌ 1నుంచి 200 ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించిన రైల్వేశాఖ మరికొన్ని రైళ్లను పట్టాలు ఎక్కించేందుకు రెడీ అవుతోంది. ప్రస్తుతం నడుపుతున్న 30 ప్రత్యేక రైళ్ల బుకింగ్ కు సంబంధించి ఇండియన్ రైల్వే కొన్ని మార్పులు చేసింది. అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్-ఏఆర్‌పీను ప్రస్తుతమున్న 7రోజుల నుంచి 30రోజుల వరకు పెంచింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో ముందస్తు రిజర్వేషన్‌ కు ప్రయాణికుల నుంచి భారీ స్పందన వస్తున్న విషయం తెలిసిందే.

అదే విధంగా రైల్వేస్ కు సంబంధించి కేవలం రెండున్నర గంటల్లోనే 4లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌, గోదావరి, హుస్సేన్‌సాగర్‌, ఫలక్‌నుమా, గోల్కొండ తదితర ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఆరోజు ప్రయాణాలకు టికెట్లు అరగంట వ్యవధిలోనే అయి పోవడం విశేషం. కాగా సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఫలక్‌నుమా, గోదావరి, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లున్నప్పటికీ ఒక్క దాంట్లోనూ ఖాళీ లేదు. దేశవ్యాప్తంగా దాదాపు లక్షన్నర ఉమ్మడి సేవా కేంద్రాలు, టికెట్‌ ఏజెంట్ల ద్వారానూ రిజర్వేషన్‌కు అనుమతించింది రైల్వే శాఖ. ప్రత్యేక రైళ్లలో టికెట్ల రిజర్వేషన్లకు తెలంగాణలో 18 రైల్వేస్టేషన్లు, ఆంధ్రప్రదేశ్‌లో 44 రైల్వేస్టేషన్లతో పాటు జోన్‌ పరిధిలోకి వచ్చే మరో 11 చోట్ల రెగ్యులర్‌ బుకింగ్‌ కౌంటర్లను ఓపన్ చేసింది దక్షిణమధ్య రైల్వే. కాగా జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు లేనివారినే ప్రయాణాలకు అనుమతిస్తున్నారు. అయితే ప్రయాణికుల వద్ద ఆరోగ్య సేతు యాప్‌ తప్పకుండా ఉన్న మొబైల్‌ ఉండాల్సిందే.