పోలీసుల మీద రుబాబు…వైసీపీ ఎమ్మెల్యే కుమారుడికి 14రోజుల రిమాండ్‌

14-day remand for son of YCP MLA

హైదరాబాద్‌ ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించి ఇన్స్‌పెక్టర్‌ను కాలితో తన్నిన కేసులో వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కుమారుడు వెంకటకృష్ణప్రసాద్‌‌ను మాదాపూర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

జులై 29న రాత్రి 9 గంటల సమయంలో మాదాపూర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ కానిస్టేబుల్‌ కృష్ణ ఖానామెట్‌ చౌరస్తాలోని మీనాక్షి స్కైలాంజ్‌ విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హైటెక్స్‌ కమాన్‌ వైపు నుంచి వస్తున్న వాహనాలను కానిస్టేబుల్ కొద్ది సేపు నిలిపివేశారు. ఇదే సమయంలో అటుగా వచ్చిన ఓ కారు నిబంధనలను ఉల్లంఘించిన ముందుకు వెళుతుండగా కానిస్టేబుల్‌ కృష్ణ అడ్డుకుని వారించాడు.

ఆ వాహనంలో ఉన్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడు సామినేని ప్రసాద్ బయటకు దిగి కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగాడు. నన్నే నువ్వు.. అని సంభోదిస్తావా అంటూ కానిస్టేబుల్‌ను నోటికొచ్చినట్టు తిట్టాడు. ట్రాఫిక్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజగోపాల్‌రెడ్డి అక్కడి చేరుకొని అతడిని వారించే ప్రయత్నం చేసినా వినిపించుకోవడంతో పోలీస్ స్టేషన్‌కు రావాల్సిందిగా సామినేని ప్రసాద్‌ను సీఐ రాజగోపాల్ కోరారు.

దీంతో మరింత రెచ్చిపోయిన అతడు నన్నే స్టేషన్‌కు రమ్మంటావా అంటూ ట్రాఫిక్ సీఐను పక్కకు నెట్టేసి, కాలుతో తన్నాడు. ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే తనయుడిపై ఐపీసీ సెక్షన్లు 332, 353, 506 కింద కేసు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మంగళవారం రాత్రి 12వ ఏఎంఎం కోర్టు జడ్జి ఎదుట హాజరుపరచగా14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో వెంకటకృష్ణప్రసాద్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.