గ్యాస్ సిలిండర్ల లారీ, బస్సు ఢీ

గ్యాస్ సిలిండర్ల లారీ, బస్సు ఢీ

ఝార్ఖండ్‌లోని పాకూర్‌లో బుధవారం ఉదయం ఘరో రోడ్డు ప్రమాదం సంభవించింది. గ్యాస్ సిలిండర్ల లోడ్‌తో వెళ్తున్న లారీని, ప్రయాణికుల ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. దీంతో బస్సులోని పది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. మొత్తం 40 మంది ప్రయాణికులతో పాకూర్ నుంచి దుమ్కాకు బయలుదేరిన బస్సును లిట్టిపడా-అమదాపరా రహదారిపై పడేర్‌కొలా వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తగా నుజ్జునుజ్జయ్యింది. బస్సులోని 25 మందికి గాయాలుకాగా.. ఘటనా స్థలిలోనే ఏడుగురు మృతిచెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు తక్షణమే స్పందించారు. పోలీసులు అక్కడకు చేరుకోవడానికి ముందే క్షతగాత్రులను బస్సులో నుంచి బయటకు తీసి అంబులెన్స్‌ల్లో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందజేయాలని అధికారులకు సూచించారు. అవసరమైతే ప్రయివేట్ ఆస్పత్రుల్లో చేర్పించాలని అధికారులను ఆదేశించారు.