రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్యాయత్నం

రైలు పట్టాలపై యువకుడి ఆత్మహత్యాయత్నం

రైలు రాక కోసం ప్రయాణికులందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వాళ్లు ఊహించినట్టే ప్లాట్‌ఫాంపై మీదకు రైలు వస్తోంది. ఇంతలో ఓ యువకుడు పట్టాల మీదకు పరుగెత్తాడు. పట్టాలపై అడ్డంగా పడుకున్నాడు. అతడి ఉద్దేశమేంటో అర్థమవడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అక్కడే ఉన్న రైల్వే పోలీసులు వెంటనే పట్టాల పైకి పరుగెత్తుకెళ్లి ఆ యువకుడిని పక్కకు ఈడ్చేశారు. మ‌హారాష్ట్ర రాజ‌ధాని ముంబైలోని విరార్ రైల్వే స్టేష‌న్‌లో ఫిబ్రవరి 24న ఈ ఘటన చోటు చేసుకుంది.

బాధితుడిని ఒడిశాకు చెందిన కిశోర్ నాయక్‌ (32)గా గుర్తించారు. తల్లి మరణం ఆ యువకుడిని తీవ్రంగా కలచివేసిందట. అమ్మ లేని లోకంలో నేనుందుకు ఉండటం అనుకున్నాడు. అలా ఆత్మహత్యాయత్నం చేశాడు. పట్టాల మీద ఓ సంచి ప‌రుచుకొని రైలుకు అడ్డంగా ప‌డుకున్నాడు. రైలు అత‌డిని స‌మీపించే లోపు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) ఇన్స్‌పెక్టర్ ప్రవీణ్ కుమార్.. అతడిని పక్కకు లాగేశారు. దీంతో ప్రమాదం తప్పింది.

కిశోర్ నాయక్‌ను లాగేసిన కొద్ది క్షణాల్లోనే రైలు ఆ ట్రాక్ పైనుంచి ముందుకు వెళ్లింది. ఈ ఘటన అక్కడున్న వారందరినీ ఉత్కంఠకు గురిచేసింది. ప్రాణాలకు తెగించి యువకుడిని కాపాడిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు రవీంద్ర, ఆశిష్‌ను అధికారులు ప్రశంసించారు.ఈ ఘ‌ట‌నకు సంబంధించిన దృశ్యాలు రైల్వే స్టేషన్‌లో అమర్చిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ వీడియోను పోలీసులు విడుదల చేశారు. ఆ దృశ్యాలను కింది వీడియోలో చూడవచ్చు.