టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్రాజు, యువ నిర్మాత ఎస్. నాగవంశీ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కిన పలు చిత్రాల నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను దిల్రాజు దక్కించుకుంటూ వచ్చారు. నాగవంశీ కూడా పలు సందర్భాల్లో దిల్రాజును తనకు స్ఫూర్తిగా పేర్కొన్నారు.
అయితే ఇటీవల వీరిద్దరి మధ్య పరిస్థితులు మారినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. నాగవంశీ తన తదుపరి చిత్రాలను అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు ఇతర డిస్ట్రిబ్యూటర్ల ద్వారా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే వీరిద్దరి మధ్య దూరం పెరగడానికి అసలు కారణం ఏమిటన్నది మాత్రం ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
ఇదిలా ఉంటే, విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ (Aadarsha Kutumbam) నైజాం థియేట్రికల్ హక్కులపై దిల్రాజు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ హక్కులను దక్కించుకునేందుకు ఆయన ఇప్పటికే దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత ఎస్. రాధాకృష్ణతో చర్చలు జరిపినట్లు సమాచారం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ప్రారంభమైనప్పటి నుంచి ఆ సంస్థ సినిమాలను నైజాం ప్రాంతంలో దిల్రాజు పంపిణీ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ‘ఆదర్శ కుటుంబం’ విషయంలోనూ అదే అనుబంధం కొనసాగుతుందా అనే ఆసక్తి నెలకొంది.
అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా నైజాం హక్కుల కోసం ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దిల్రాజు అందించిన ఫ్యాన్సీ ఆఫర్కు మేకర్స్ ఓకే చెబుతారా? లేక వేరే డిస్ట్రిబ్యూటర్కు హక్కులు అప్పగిస్తారా? అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.






