శానిటైజర్‌ తాగి మృత్యువాత పడ్డ వ్యక్తి

శానిటైజర్‌ తాగి మృత్యువాత పడ్డ వ్యక్తి

నీళ్లు అనుకుని శానిటైజర్‌ బాటిల్‌లోని శానిటైజర్‌ తాగడంతో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన విశాఖపట్నంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. విశాఖ జిల్లాకు చెందిన సారిపల్లి సత్తిబాబు నక్కపల్లి తహసీల్దార్‌ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. నిన్న(శనివారం)సాయంత్రం ఆఫీసులో ఉన్న సమయంలో విపరీతంగా దాహం వేసింది. దీంతో అక్కడే ఉన్న శానిటైజర్‌ బాటిల్‌ను వాటర్‌ బాటిల్‌ అనుకుని అందులోని శానిటైజర్‌ గటాగటా తాగేశాడు.

అనంతరం ఒంట్లో బాగుండటం లేదని సర్వేయర్‌కు చెప్పడంతో పక్కనే ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం సత్తిబాబు ఇంటికి వెళ్లిపోయాడు. అయితే అర్థరాత్రి సమయంలో వాంతులు, విరేచనాలు మొదలవ్వటంతో అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు