ఐకాన్ స్టార్ అల్లూ అర్జున్ మరియు తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘AA23’ ఇప్పటికే అధికారికంగా ప్రకటించబడిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్కు విడుదలైన అనౌన్స్మెంట్ థీమ్ వీడియో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ సినిమాపై అనేక రకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్తలు అభిమానుల్లో సందేహాలు కలిగిస్తున్నాయి.
కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నాయి. లోకేష్ కనగరాజ్ వినిపించిన కథకు అల్లూ అర్జున్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఫైనల్ స్క్రిప్ట్ను సిద్ధం చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను పక్కా ప్లానింగ్తో నిర్మిస్తూ, అన్ని పనులు సరైన ట్రాక్లోనే ముందుకు తీసుకెళ్తోంది.
ప్రస్తుతం అల్లూ అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో రూపొందుతున్న ‘రాకా’ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది లోపే ఆ సినిమా షూటింగ్ను పూర్తి చేసి, వచ్చే ఏడాది విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమాను పట్టాలెక్కించి, వేగంగా షూటింగ్ పూర్తి చేసి 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నది బన్నీ ప్లాన్గా తెలుస్తోంది.
