Basil Joseph నేడు మలయాళ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన దర్శకులు, నటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. అయితే ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి చేసిన ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. నెలకు లక్షల్లో జీతం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి, సినిమాలపై ఉన్న అభిరుచితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాసిల్ జోసెఫ్ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
కేరళకు చెందిన బాసిల్ జోసెఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రముఖ ఐటీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశారు. మంచి జీతం, స్థిరమైన కెరీర్ ఉన్నప్పటికీ, చిన్నప్పటి నుంచి ఉన్న నటన, సినిమాలపై ఆసక్తి ఆయనను సినీ రంగం వైపు నడిపించింది. ఉద్యోగం చేస్తూనే యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ రూపొందించి తన ప్రతిభను చాటుకున్నారు.

ఆ ప్రతిభే ఆయనకు సినీ అవకాశాలను తెచ్చిపెట్టింది. 2015లో విడుదలైన ‘కుంజిరామాయణం’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేసిన బాసిల్, తొలి సినిమాతోనే విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత ‘గోదా’, ‘మిన్నల్ మురళి’ వంటి చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ బాసిల్ జోసెఫ్ విజయవంతమైన కెరీర్ను నిర్మించుకున్నారు. ‘జయ జయ జయ జయ హే’, ‘ఫాలిమి’, ‘పోన్మాన్’, ‘సూక్ష్మ దర్శిని’, ‘ప్రవింకూడు షప్పు’ వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విభిన్న కథలను ఎంచుకుంటూ నటుడిగా కూడా తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకున్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్తో బాసిల్ జోసెఫ్ సినిమా తెరకెక్కించనున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ వార్తతో బాసిల్ జోసెఫ్ పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి తన కలను నమ్ముకుని ముందుకు సాగిన Basil Joseph, నేడు దర్శకుడిగా, నటుడిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందడం ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.






