ఐపీఎల్‌పై ఆకిబ్‌ జావెద్‌ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్‌పై ఆకిబ్‌ జావెద్‌ సంచలన వ్యాఖ్యలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై పాకిస్థాన్ మాజీ బౌలర్‌ ఆకిబ్‌ జావెద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ కంటే తమ దేశంలో జరిగే పీఎస్‌ఎల్‌ గొప్పదని వ్యాఖ్యానించాడు. పీఎస్‌ఎల్‌లో ఆడే బౌలర్లతో పోలిస్తే.. ఐపీఎల్‌ బౌలర్ల బౌలింగ్‌ నాణ్యత చాలా తక్కువని, భారత్‌లో ఒకే రకమైన ఫ్లాట్‌ పిచ్‌లపై వారు నాసిరకమైన బౌలింగ్‌ చేస్తారని, పాక్‌లో పిచ్‌లు ఇందుకు భిన్నమని ఆక్కసుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. కోవిడ్‌​ అవరోధాలు లేకుండా సాగితే పీఎస్‌ఎల్‌ తదుపరి ఎడిషన్‌ సూపర్‌ సక్సెస్‌ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. మరికొద్ది రోజుల్లో పీఎస్‌ఎల్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆకిబ్‌ ఈ మేరకు వ్యాఖ్యానించాడు.

కాగా, ఆకిబ్‌ చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్‌ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా అతన్ని ఓ ఆటాడుకుంటున్నారు. మెంటల్‌ హాస్పటల్‌లో చేరాలని సూచిస్తున్నారు. పాక్‌లో గొప్ప బ్యాటర్లు లేక బౌలర్లు గుర్తింపు పొందారని, లేకపోతే పాక్‌ బౌలర్లకు అంత సీన్‌ లేదని కామెంట్లు చేస్తున్నారు. గతంలో పాక్‌ బౌలింగ్‌ కోచ్‌గా పని చేసిన ఆకిబ్‌.. ప్రస్తుతం పీఎస్ఎల్‌లో లాహోర్ ఖలందర్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.