మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

మధ్యప్రదేశ్‌లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. సత్నా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. కారు-ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. ఘటనా స్థలిలోనే ఆరుగురు చనిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం రేవా ఆస్పత్రికి తరలించారు.

ఓ కుటుంబం పన్నాలోని బంధువు కర్మలకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.మృతుల ప్రయాణిస్తోన్న బొలేరా వాహనాన్ని రేర్వా వద్ద ఎదురుగా వస్తున్న భారీ ట్రక్ ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయి అందులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో మృతదేహాలు బొలేరాలో చిక్కుకున్నాయి.

క్షతగాత్రులను కూడా బయటకు తీయడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు.క్రేన్ సాయంతో వాహనాన్ని వేరుచేసి మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాదంపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోస్ట్‌మార్టం పూర్తయిన తర్వాత మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు.