ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం

ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం

దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ 4జీ, బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలు శుక్రవారం రోజున ఉదయం ఒక్కసారిగా పడిపోయాయి. ఎయిర్‌ టెల్‌ యూజర్లకు ఏకధాటిగా 20 నిమిషాల పాటు బ్రాడ్‌బ్యాండ్‌, నెట్‌వర్క్‌ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పలు వెబ్‌సైట్స్‌, సర్సీసులకు రియల్‌ టైం ఇన్ఫర్మేషన్‌ను అందించే డౌన్‌ డిటెక్టర్‌ కూడా ఎయిర్‌టెల్‌ సేవల్లో అంతరాయం ఏర్పడినట్లు పేర్కొంది.

ఎయిర్‌ టెల్‌ సేవలు రావడం లేదంటూ డౌన్‌ డిటెక్టర్‌లో ఫిర్యాదులు ఉదయం 10:58 గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్‌, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కత్తా, జైపూర్‌, ఇండోర్‌, ముంబై లాంటి ప్రధాన నగరాలతో పాటుగా అనేక నగరాల్లో ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం కల్గినట్లు డౌన్‌ డిటెక్టర్‌ నివేదించింది.దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌, బ్రాడ్‌ బ్యాండ్‌ సేవల అంతరాయంపై ఎయిర్‌టెల్‌ స్పందించింది.శుక్రవారం తెల్లవారుజామున నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని ఎయిర్‌టెల్ తెలిపింది.

‘సాంకేతిక లోపం కారణంగా మా ఇంటర్నెట్ సేవలకు ఈ ఉదయం కొంతసేపు అంతరాయం ఏర్పడింది. సేవలు పూర్తిగా పునరుద్ధరించబడ్డాయి. మా వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి మేము తీవ్రంగా చింతిస్తున్నాము” అని ఎయిర్‌టెల్ ప్రతినిధి అన్నారు. కాగా చాలా మంది వినియోగదారులకు 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే అంతరాయం ఉన్నట్లు అనిపించినప్పటికీ, చాలా మంది తమ సేవలు ఇంకా బ్యాకప్ కాలేదని ట్విటర్‌లో పేర్కొన్నారు.

ఎయిర్‌టెల్ సేవలు తగ్గుముఖం పట్టడంతో ట్విట్టర్‌లో యూజర్లు మీ​మ్స్‌తో విరుచుకపడ్డారు. యూజర్లు  ట్విటర్‌లో ట్రెండింగ్‌ చేశారు. ‘ఎన్నిసార్లు నా స్మార్ట్‌ఫోన్‌ ఎయిర్‌ప్లేన్‌ మోడ్‌ బటన్‌ నొక్కిన కూడా రాకపోవడంతో అలసిపోయనట్లు’ ఒక నెటిజన్‌ మీమ్‌తో నవ్వులు పూయించాడు. మరొక నెటిజన్‌…దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ సేవలు ఒక్కసారిగా డౌన్‌ అవ్వడంతో ఇతర టెలికాం కంపెనీలు పండగ చేసుకుంటున్నాయంటూ మీమ్‌తో తెలిపాడు.