అమరావతి ఎంపీ కి కరోనా పాజటివ్‌

అమరావతి ఎంపీ కి కరోనా పాజటివ్‌

కరోనా మహమ్మారి బారిన పడుతున్న ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా అమరావతి ఎంపీ, నటి నవనీత్‌ కౌర్‌ కరోనా బారిన పడ్డారు. ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా ఆమెకు పాజటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆమెతోపాటు భర్త రవి రానా, పిల్లలకు కూడా కరోనా సోకినట్లు తేలింది. ఈ విషయాన్ని స్వయంగా నవనీత్‌ కౌర్‌ వెల్లడించారు.

‘నా కుమార్తె, కొడుకు, ఇతర కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు. వారిని చూసుకోవడం నా బాధ్యత. వారి బాగోగులు చూసుకునే క్రమంలో నేనూ కరోనా బారిన పడ్డాను’ అని ఆమె సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నారు. నవనీత్‌ కుటుంబంలో ఇప్పటికే 10 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. వారంతా నాగపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తెలుగు ప్రజలకు నవనీత్‌ కౌర్‌ సుపరిచితురాలే. శీను వాసంతి లక్ష్మి సినిమా ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన నవనీత్‌, ఆ తర్వాత రూమ్ మేట్స్, జగపతి తదితర సినిమాల్లో నటించారు. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘యమదొంగ’ సినిమాలోని ఓ ప్రత్యేక పాటలో కనిపించారు. పంజాబీ, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఆమె పలు చిత్రాల్లో నటించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు.