బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంలో విషాదం నెలకొంది. అమితాబ్ వియ్యంకుడు ఎస్కార్ట్స్ గ్రూప్ అధినేత రాజన్ నందా నిన్న రాత్రి మరణించారు. అమితాబ్ బచ్చన్ తన కుమార్తె శ్వేత బచ్చన్ వివాహం రాజన్ నందా కుమారుడు నిఖిల్ నందాతో జరిపించిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రాజన్ గత రాత్రి తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అయితే ప్రస్తుతం అమితాబ్ బ్రహ్మాస్త్ర షూటింగ్ కోసం బల్గేరియాలో ఉన్నారు. అయితే, రాజన్ నందా మరణవార్త తెలుసుకుని హుటాహుటిన బల్గేరియా నుంచి ముంబాయికి వచ్చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ ట్వీట్ చేశారు. ‘‘నా బంధువు రాజన్ నందా, నిఖిల్ తండ్రి, శ్వేత మామగారు ఇప్పుడే కన్నుమూశారు. ఇండియా వెళుతున్నాను’’ అంటూ బిగ్బి ట్వీట్లో పేర్కొన్నారు. రాజన్ మృతి పట్ల పలువురు ప్రముఖులు, బాలీవుడ్ వర్గాలు సంతాపం తెలియజేస్తున్నారు.