చైనాపై పంచ్‌ వేసిన ఆనంద్‌ మహీంద్రా

చైనాపై పంచ్‌ వేసిన ఆనంద్‌ మహీంద్రా

పొరుగు దేశాలతో నిత్యం కయ్యానికి కాలుదువ్వుతూ స్వంత విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న చైనాపై అదిరిపోయే పంచ్‌ విసిరారు ఆనంద్‌ మహీంద్రా. కాలం గడుస్తున్నా పదే పదే ‍కరోనా బారిన పడుతూ ఒకే రకమైన ఇబ్బందికర పరిస్థితుల్లో చిక్కుకుంటున్న చైనాను గ్రౌండ్‌హాగ్‌ డేతో పోల్చుతూ చురకలు అంటించారు. బయటి దేశాలకు బడాయి మాటలు చెప్పుతూ ఇంటిని చక్కదిద్దుకోవడంలో విఫలమవుతున్న అక్కడ పాలకుల తీరుని ఎండగట్టారు ఆనంద్‌ మహీంద్రా.

చైనాలో నెలకొన్న పరిస్థితిని హాలీవుడ్‌ ఫాంటసీ కామెడీ చిత్రమైన గ్రౌండ్‌హాగ్‌ డేతో పోల్చుతూ సెటైర్‌ వేశారు ఆనంద్‌ మహీంద్రా. గ్రౌండ్‌హాగ్‌డే చిత్రంలో ప్రధాన పాత్రలు పదేపదే ఒకే రకమైన అవాంఛిత సంఘటనలను ఎదుర్కొంటూ ఉంటాయి. 1993లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మోముల్లో నవ్వులు పూయించింది.అంతర్గత సమస్యలపై సరిగా దృష్టి పెట్టకుండా సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతూ అరుణాచల్‌ ప్రదేశ్‌, లఢాక్‌ ఏరియాలో సమస్యలు సృష్టిస్తోంది చైనా.

మరో పొరుగు దేశమైన తైవాన్‌ను కబళించేందుకు ఊవ్విళూరుతోంది. చైనా పాలకులు పొరుగు దేశాల వ్యవహారాల్లో తలదూరుస్తూ బిజీగా ఉండగా మరోసారి చైనాలోని పెద్ద నగరాల్లో ఒకటైన షెన్‌జెన్‌లో కరోనా చాపకింద నీరులా విస్తరించింది. ఇప్పుడు వేరే గత్యంతరం లేక వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మరోసారి లాక్‌డౌన్‌ విధించింది చైనా. వెల్లువల వచ్చి పడుతున్న రోగుల కోసం శరవేగంగా ఆరువేల పడకల ఆస్పత్రి నిర్మాణం చేపడుతోంది.

కరోనా ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లలో భారత ప్రజలు ఇబ్బందులు పడింది. ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. కానీ థర్డ్‌వేవ్‌ నాటికి దేశంలో పరిస్థితులు చక్కబడ్డాయి. కఠిన ఆంక్షలు సరిపోయాయి.. ఎక్కడా లాక్‌డౌన్‌ పెట్టాల్సిన అవసరం రాలేదు. కానీ చైనా పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. రెండేళ్ల క్రితం విధించిన ఫస్ట్‌వేవ్‌ లాక్‌డౌన్‌ లాంటి పరిస్థితులే అక్కడ పునరావృతం అవుతున్నాయి. చైనాలో షెన్‌జెన్‌లో కరోనా విస్త్రృతిని చైసిన యాపిల్‌ సంస్థ అక్కడున్న తమ కర్మగారాల్లో తమ ఉత్పత్తిని నిలిపేసింది.