లీడ్ రోల్ చేస్తున్న అనసూయ

లీడ్ రోల్ చేస్తున్న అనసూయ

క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవ్థను, ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇండ‌స్ట్రీని తీవ్రంగా దెబ్బతీసింది. అయితే క‌ళాకారుల త‌ప‌న‌ను అది దెబ్బతీయ‌లేక‌పోయింది. ఆ క‌రోనా కాలానికి సంబంధించిన కాల్పనిక ఘ‌ట‌న‌ల‌ను ఆధారం చేసుకొని ర‌మేష్ రాప‌ర్తి ‘థ్యాంక్ యు బ్రద‌ర్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు టైటిల్ పోస్టర్‌ను బ‌ట్టి తెలుస్తోంది.

ఈ టైటిల్ పోస్టర్‌ను హీరో రానా ద‌గ్గుబాటి లాంచ్ చేశారు. ఆ పోస్టర్‌లో ఓ లిఫ్ట్‌, దాని ఎదురుగా ఫ్లోర్ మీద ప‌డి ఉన్న మాస్క్ క‌నిపిస్తున్నాయి. త‌న ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా రానా షేర్ చేసిన వీడియోలో యూనిట్ మెంబ‌ర్స్‌ను ఒక్కొక్కరిని మాస్క్ పెట్టుకోమ‌ని అడిగి, వారు మాస్క్ పెట్టుకోగానే ‘థ్యాంక్ యు బ్రద‌ర్’ అని చెప్పడం క‌రోనా కాలంలో మాస్క్ ప్రాధాన్యాన్ని చెప్తున్నట్లే క‌నిపిస్తోంది. టైటిల్ పోస్టర్ చాలా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తోంది. ఎలివేట‌ర్(లిఫ్ట్‌)కు క‌థ‌లో కీల‌క పాత్ర ఉంద‌నే అభిప్రాయాన్ని పోస్టర్ క‌లిగిస్తోంది. ఫ‌స్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడు వ‌స్తుందా అనే ఆస‌క్తిని కూడా ఈ పోస్టర్ మ‌న‌లో క‌లిగిస్తుంద‌నేది నిజం.

స్క్రిప్టుల ఎంపికలో ఆచితూచి వ్యవ‌హ‌రించే అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ చేస్తుండ‌గా.. అశ్విన్ విరాజ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ‘థ్యాంక్ యు బ్రద‌ర్’ అనేది థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో త‌యార‌వుతున్న డ్రామా ఫిల్మ్‌. ఉత్కంఠ‌భ‌రిత క‌థ‌నంతో న‌డిచే ఒరిజిన‌ల్ కాన్సెప్టుల‌తో రూపొందే చిత్రాల‌ను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉన్నారు. జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణ‌మ‌వుతున్న ‘థ్యాంక్ యు బ్రద‌ర్’ ఆర్డిన‌రీ మూవీ మాత్రం కాదని చిత్ర యూనిట్ అంటోంది.