ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ

ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు జారీ చేయనుంది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడపాలని, మాస్క్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

కోవిడ్‌ పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ విస్తరణ, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. దేశవ్యాప్తంగా వైరస్‌ విస్తరిస్తున్న విషయాన్ని అధికారులు వివరించారు. కోవిడ్‌ సోకిన వారికి దాదాపుగా స్వల్ప లక్షణాలు ఉంటున్నాయని అధికారులు తెలిపారు.

కోవిడ్‌లో ఒమిక్రాన్‌ లాంటి కొత్త వేరియంట్‌ నేపథ్యంలో మార్పు చేయాల్సిన మందుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆ మేరకు హోం కిట్‌లో మార్పులు చేయాలన్నారు. వైద్యనిపుణులతో సంప్రదించి ఇవ్వాల్సిన మందులను సిద్ధంచేయాలన్నారు. అంతేకాక చికిత్సలో వినియోగించే మందుల నిల్వలపై సమీక్ష చేయాలని, అవసరం మేరకు వాటిని కొనుగోలుచేసి సిద్ధంగా ఉంచుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.