దిలీప్ కుమార్‌ను వెంటాడుతున్న విషాదాలు

దిలీప్ కుమార్‌ను వెంటాడుతున్న విషాదాలు

బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు దిలీప్ కుమార్‌ను విషాదాలు వెంటాడుతున్నాయి. క‌రోనా బారిన ప‌డ్డ‌ ఆయ‌న మ‌రో సోద‌రుడు ఇషాన్ ఖాన్‌(90) బుధ‌వారం అర్ధ‌రాత్రి ప్రాణాలు విడిచారు. ఈ విష‌యాన్ని ఆయ‌న‌కు చికిత్స‌ అందిస్తున్న వైద్యుడు డా.జ‌లీల్ పార్క‌ర్ ధ్రువీక‌రించారు. కాగా గ‌త నెల‌లోనే దిలీప్‌కుమార్ సోద‌రులు అస్లాంఖాన్‌, ఇషాన్ ఖాన్‌లు కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో ముంబైలోని లీలావ‌తి ఆస్పత్రి‌లో చేరారు. ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఇద్ద‌రికీ పాజిటివ్ రావ‌డంతో వెంట‌నే క‌రోనా వార్డుకు త‌ర‌లించి చికిత్స అందించారు.

ఇద్ద‌రికి అనారోగ్య స‌మ‌స్య‌లు ఉండ‌టంతో వైద్యులు వారిని ఐసీయూకి త‌ర‌లించి చికిత్స అందించారు. వారికి ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ కూడా త‌క్కువ‌గా ఉన్న‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలో ఆగ‌స్టు 21న ప‌రిస్థితి విష‌మించి అస్లాం ఖాన్ చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న మ‌రువ‌క‌ముందే మ‌రో సోద‌రుడు ఇషాన్ ఖాన్‌ మ‌రణించ‌డంతో దిలీప్ కుమార్ ఇంట విషాదం నెల‌కొంది. ఆయ‌నను కొంత‌కాలంగా గుండెజ‌బ్బు, అధిక ర‌క్త‌పోటు వంటి స‌మ‌స్య‌లు వేధిస్తున్నాయి. ఇంత‌లో క‌రోనా రావ‌డంతో ఆరోగ్యం మ‌రింత క్షీణించి తుది శ్వాస విడిచారు.