రాష్ట్రంలో పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు

రాష్ట్రంలో పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు

రాష్ట్రంలో పాస్‌పోర్టుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్‌ సమయంలో విదేశాలకు వెళ్లేందుకు ఆంక్షలు ఉండటంతో ఎవరూ పెద్దగా ముందుకు రాలేదు. తాజాగా విదేశాల్లోని కాలేజీలు, యూనివర్సిటీల్లో అడ్మిషన్లు మొదలుకావడం, అంతర్జాతీయంగా కోవిడ్‌ ఆంక్షలు సడలించడంతో దరఖాస్తులు ఊపందుకున్నాయి. కోవిడ్‌ సమయంలో విజయవాడ, విశాఖపట్నం ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాలతో పాటు తిరుపతి పాస్‌పోర్టు సేవా కేంద్రానికి రోజుకు 300 చొప్పున దరఖాస్తులు మాత్రమే వచ్చేవి. అంటే మూడింటిలో కలిపి 900 మాత్రమే అందేవి.

ఇప్పుడా సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒక్కో కేంద్రంలో 500 చొప్పున రోజుకు 1,500 వరకు స్లాట్‌లు విడుదల చేస్తున్నారు. అలాగే 22 పోస్టాఫీసుల నుంచి రోజుకు వెయ్యి స్లాట్‌లు ఇస్తున్నారు. అంటే రోజుకు మొత్తమ్మీద 2,500 స్లాట్‌లు లభిస్తున్నాయి. అయినప్పటికీ 20 రోజుల పాటు వెయిటింగ్‌ లిస్టు వస్తోంది. దరఖాస్తుల్లో 40 శాతం విద్యార్థులవే కావడం గమనార్హం. కెనడా, అమెరికా, యూకే దేశాలకు చదువుల నిమిత్తం వెళుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అదేవిధంగా అమెరికా, ఇతర దేశాల్లో స్థిరపడిన పిల్లలను చూసేందుకు, వాళ్లకు ప్రసవ సమయంలో తోడ్పాటు అందించేందుకు వెళ్తున్న తల్లిదండ్రుల సంఖ్య సైతం పెరిగింది.