సిరిసిల్ల జిల్లాలో హల్‌చల్ చేసిన ఎలుగుబంటి

సిరిసిల్ల జిల్లాలో హల్‌చల్ చేసిన ఎలుగుబంటి

సిరిసిల్ల జిల్లాలో ఎలుగుబంటి హల్‌చల్ చేసింది. రుద్రంగి మండలం దేగావత్ తండాలో ఆవులు మేపడానికి వెళ్లిన వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దేగావత్ తండాకు చెందిన కున్సోతు గంగాధర్ (50) ఆవుల మందకు కాపరిగా ఉంటూ జీవనోపాధి పొందుతున్నాడు. మంగళవారం తప్పిపోయిన ఆవులను వెతికే క్రమంలో మానాల అటవీ ప్రాంతానికి వెళ్ళాడు.

ఈ క్రమంలోనే పొదల్లో నుంచి ఒక్కసారిగా ఎలుగుబంటి వచ్చి గంగాధర్‌పై దాడి చేసింది. అతడిని పట్టుకుని గోళ్లతో శరీరాన్ని రక్కేసింది. కనుగుడ్లు పీకేస్తూ ముఖం నిండా గాయాలు చేస్తూ నరకం చూపించింది. గంగాధర్ తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. చివరికి బాధితుడి అరుపులతో స్పందించిన సమీపంలోని రైతులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దీంతో ఎలుగుబంటి వెంటనే అడవిలోకి పారిపోయింది.

ఈ ఘటనలో గంగాధర్ తల, కళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావంతో బాధితుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు అతడికి నీళ్లు తాగించి వెంటనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగాధర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఎలుగుబంటి దాడితో స్థానికులు అటవీ ప్రాంతంలోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.