దళితుల ప్రాణాలకు విలువ లేదా

దళితుల ప్రాణాలకు విలువ లేదా

రాష్ట్రంలో దళితులకు బతికే హక్కు, వారి ప్రాణాలకు విలువ లేదా అని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో గత ఏడేళ్ల నుంచి దళిత, గిరి జనులపై అనేక అకృత్యాలు జరుగుతున్నాయని, అయినా పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి ఆయన మీడియాతో మంగళవారం మాట్లాడారు.

రూ.2 లక్షల దొంగతనం ఆరోపణతో దళిత మహిళ మరియమ్మను అన్యాయంగా, అతికిరాతకంగా పోలీసులు కొట్టి చంపారన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలిపారు. రాష్ట్రంలోని పేద దళిత కుటుంబాల ప్రాణాలు, వారి హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అసలు హోంశాఖ, హోంమంత్రి ఉన్నారా అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. అనేక సందర్భాల్లో ప్రశ్నించే దళిత సంఘాలు మరియమ్మ విషయంలో ఎటు పోయాయని జగ్గారెడ్డి ప్రశ్నించారు.