కలకలం రేపిన నాటుబాంబు పేలుడు

కలకలం రేపిన నాటుబాంబు పేలుడు

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నాటుబాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌లో అడవి పందుల వేట కోసం వేటగాళ్లు నాటుబాంబులు అమర్చారు. ఈ క్రమంలోనే సోమవారం అవి ఆకస్మాత్తుగా పేలడంతో స్థానికంగా నివసించే కుల్దీప్‌ సింగ్‌ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

దీంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన నాటుబాంబు ప్రమాదవశాత్తూ పేలిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.