రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు కోల్పోయిన యువకుడు

రైల్వే ట్రాక్‌పై ప్రాణాలు కోల్పోయిన యువకుడు

రైల్వే ట్రాక్‌పై టిక్‌టాక్ చేస్తూ ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. టిక్‌టాక్ వీడియో కోసం రైలు వస్తుండగా ట్రాక్‌ పక్కన నుంచి నడుస్తూ ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నాడు. స్నేహితులను వీడియో తీయమంటూ యువకుడు వేగంగా రైలు వస్తున్న విషయం తెలిసి నడుచుకుంటూ వెళ్లాడు. ప్రమాదం నుంచి తప్పించుకునేలోపే వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు మృతిచెందాడు. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లోని రావల్పిండి సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది.

పాక్ రాజధాని ఇస్లామాబాద్ సమీపంలోని రావల్పిండి పక్కనే ఉన్న షా ఖలీద్ వద్ద జరిగిన ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ.. టిక్‌టాక్ కోసం ప్రమాదకరంగా వీడియో చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలిపారు. మృతుడు హమ్జా నవీద్ (18) ట్రాక్ పక్కన నడుస్తుండగా అతడి స్నేహితుడు వీడియో తీశాడని స్థానిక రెస్క్యూ ఏజెన్సీ అధికార ప్రతినిధి రాజా రఫఖత్ జమాన్ అన్నారు.

రైల్వే ట్రాక్ వెంట నడుస్తున్నట్టు వీడియోకు ఫోజులిస్తుండగా.. వేగంగా వచ్చిన రైలు అతడిని ఢీకొట్టిందని జమాన్ తెలిపారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడకు చేరుకునేటప్పటికే ఆ యువకుడు చనిపోయాడని అన్నారు.

టిక్‌టాక్, ఇతర సోషల్ మీడియా సైట్‌లలో పోస్ట్ చేయడానికే ట్రాక్‌పై నడుస్తున్నట్టు వీడియో తీయించాడని యువకుడి స్నేహితులు తెలిపారు. ఈ ఘటనను పోలీస్ అధికారులు ధ్రువీకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. రైలు వెళ్తుండగా సెల్ఫీలు, వీడియోలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం యువతకు హాబీగా మారింది. వీటికోసం కోరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.