Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
-
ఆగని ప్రేమోన్మాదుల దాడులు
-
యువతిని చంపి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ప్రేమోన్మాదం బుసలుకొడుతోంది. సంధ్యారాణి ఘటన మర్చిపోకముందే వారంలో రెండుసార్లు అలాంటి తరహా ఘటనలే జరిగి అమ్మాయిల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ ప్రేమోన్మాది ప్రియురాలని కొట్టి చంపి, ఆపై ఆత్మహత్య చేసుకోగా… శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఈ తరహా దారుణం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
దమ్మపేట మండలం నెమలిపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పల్లవి అనే యువతి విద్యావాలంటీర్ గా పనిచేస్తోంది. అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరాజు కొంతకాలంగా పల్లవిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ ఉదయం కూడా పల్లవి పాఠశాలకు వెళ్తున్న సమయంలో వెంటపడ్డాడు. ఎప్పటిలానే అతని మాటలు పట్టించుకోకుండా పల్లవి స్కూల్ కు వెళ్లిపోయింది. విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికి బయలుదేరేందుకు సిద్ధమవగా శ్రీనివాసరాజు మళ్లీ పాఠశాల వద్దకు వచ్చాడు. తనని పెళ్లిచేసుకోవాలని బలవంతం చేశాడు. ఇందుకు పల్లవి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన శ్రీనివాసరాజు కత్తితో పల్లవి మెడపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం అక్కడికక్కడే తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాఠశాల ఆవరణలోనే ఈ దారుణం చోటుచేసుకోవడంతో విద్యార్థులంతా తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఇటీవలే పల్లవికి వివాహం నిశ్చయం కావడంతో ఆమె ఇక తనకు దక్కదన్న అక్కసుతోనే శ్రీనివాసరాజు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని స్థానికులు చెబుతున్నారు