అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

కారు అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లడంతో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మండలంలో దేవరాజుగట్టు ఎస్సీ కాలనీలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మార్కాపురం పట్టణానికి చెందిన సూరె కోటేశ్వరరావు, ఆయన కుమారుడు వెంకటకృష్ణారావు కలిసి గుంటూరు వైద్యశాలకు వెళ్లి తిరిగి మార్కాపురం వస్తున్న సమయంలో కారు అదుపుతప్పి కాలనీకి చెందిన కటికల ప్రసాద్‌ ఇంట్లోకి దూసుకువెళ్లింది.

ప్రమాదంలో బాపూజీ కాలనీకి చెందిన డ్రైవర్‌ కటికల ప్రవీణ్‌ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్‌ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని తీవ్ర గాయాలైన ఇద్దరిని మార్కాపురం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో చికిత్స పొందుతూ వెంకటకృష్ణారావు (31) మృతి చెందాడు. స్వల్ప గాయాలైన కోటేశ్వరరావుకు మెరుగైన వైద్యం నిమిత్తం పట్టణంలో ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు.

కాలనీ దగ్గర కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్న కాంట్రాక్టర్‌ కాలనీకి పక్కన ఉన్న రోడ్డుకు ఇరువైపులా డైవర్షన్‌ బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కారు డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో వచ్చి ప్రమాదానికి గురయ్యారు. అ సమయంలో ఇంటి లోపల కటికల మేరికుమారి కుమారుడు పంచలో కూర్చొని ఉన్నాడు. వారికి ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంటికి ముందు ఉన్న గోడను కారు బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జు నుజ్జయింది.