అదుపుతప్పి చెరువులో పడిన కారు

అదుపుతప్పి చెరువులో పడిన కారు

గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని యర్రబాలెం వద్ద నలుగురు స్నేహితులు ప్రయాణిస్తున్న కారు సోమవారం రాత్రి అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులూ జలసమాధి అయ్యారు. వీరంతా మంగళగిరి ప్రాంతానికి చెందిన వారే. వడ్రంగి పనిచేసే వాకా శ్రీనివాసరావు , డాక్యుమెంట్‌ రైటర్‌ తేజ్‌రాంజీ , ఇతని అసిస్టెంట్‌ కొల్లూరు సాయి , ఏసీ మెకానిక్‌ పవన్‌కుమార్‌ స్నేహితులు.

వీరు కారులో తుళ్లూరు వెళ్లి వస్తుండగా యర్రబాలెం యర్రచెరువు వద్దకు రాగానే కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లిపోయింది. కారు అద్దాలు తెరిచి ఉండడంతో నీళ్లు ప్రవేశించి నలుగురు జలసమాధి అయ్యారు. తుళ్లూరు నుంచి వాహనాలపై వస్తున్న వారు ఈ విషయాన్ని గమనించి ఆ మార్గంలో వస్తున్న లారీని ఆపి తాడు సహాయంతో కారును బయటకు తీశారు. 108 సిబ్బంది ఆ నలుగురిని పరిశీలించి మృతిచెందినట్లు నిర్ధారించారు.